ఇటీవల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీలకు అతీతంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మహిళలను లాగి అసత్య ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బపడింది. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హైకమాండ్ కూడా కొండా సురేఖపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఒక దశలో మంత్రి పదవి నుంచి కూడా తొలగిస్తారనే ప్రచారం జరిగింది. నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశాడు. కానీ, అనూహ్యంగా సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాగార్జునను టార్గెట్ చేసింది. గత నెలలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చారు. ఎఫ్ఎటీఎల్ లో నిర్మించారనే కారణంగా హైడ్రా ఈ హాల్ ను కూల్చేసింది. తాజాగా, నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంటే నెల రోజుల తర్వాత, కొండా సురేఖ ఘటన తర్వాత నాగార్జునపై పగబట్టారన్నమాట. కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, నాగార్జునపై కేసు నమోదు కాలేదు. లీగల్ ఒపీనియన్ తర్వాత కేసు పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని పోలీసులు చెబుతున్నారు.