రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని విమర్శించారు. ఈ మేరకే ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు అని నిలదీశారు. ఏ తప్పు చేయని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా అని ప్రశ్నించారు. స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్ లో దాచిపెట్టారన్నారు. హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారని పోలీసులను నిలదీశారు. ఇంతగా హింస చేస్తుంటే పౌరులకు రక్షణ ఏముంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగంలో శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఎంతమాత్రం సహించరని, ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామని, హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.