చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను టీడీపీ కార్యకర్త తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె
భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80,000 అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప భార్య, బిడ్డలను గ్రామంలోనే వదిలి వెళ్లిపోయాడు. శిరీష కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్నది. ఈ క్రమంలో అప్పులు సకాలంలో చెల్లించలేదని సదరు వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ, తన అప్పు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు గురిచేయసాగారు. అంతటితో ఆగకుండా ఆమెను చెట్టుకు తాళ్లతో కట్టేసి కొట్టారు. టీడీపీ కార్యకర్త మునికన్నప్ప చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిరీషను చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.