గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రితో సహా అందరినీ కలుస్తామన్నారు. నీటి వాటాపై తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతున్న బనకచర్ల లింక్ ప్రాజెక్టు, దాని పర్యవసనాలు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీలు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, రామసహాయం రఘురామి రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.
అన్ని పార్టీలు సహకరించాలి….
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచర్ల ద్వారా తరలించడానికి కడుతున్న ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేశామన్నారు. త్వరలో దీనిపై ప్రధానమంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు వివిధ సంస్థలు నిధులు సమకూర్చే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని, అలాగే ప్రాజెక్టుకు అనుమతించరాదని పర్యావరణ శాఖ మంత్రిని.. ఇలా సంబంధించిన శాఖలన్నింటినీ కలిసి అభ్యంతరాలను తెలియజేశామన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపడటంలో ప్రభుత్వం బాధ్యతతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ విషయంలో అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి తెలంగాణకు జరగబోయే నష్టంపై మరోసారి వివరిస్తామన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం
రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థల వద్దకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ఎవరినైనా కలుస్తామన్నారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పర్యావరణ, జలశక్తి వంటి వ్యవస్థలన్నింటితోనూ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, అప్పటికీ న్యాయం దక్కకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బనకచర్ల ప్రాజెక్టు వివాదం ఆకస్మికంగా తెరమీదకు వచ్చింది కాదని, 2016 లో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారన్నారు. నాడు ఇరు రాష్ట్రాల సీఎంలు తీసుకున్న నిర్ణయాల పరిణామ క్రమంలోనే బనకచర్లకు బీజం పడిందన్నారు.