పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు చర్యలు ముమ్మరం చేశాయి. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారి ఇండ్లను ధ్వంసం చేశాయి. జమ్మూకశ్మీర్లో సుమారు ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను బాంబులతో పేల్చాయి. షోపియాన్లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని, కుల్గాంలోని మతాలం ప్రాంతంలో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు అనుచరులను భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి.