పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యపై భారతీయులు రగిలిపోతున్నారు. ఈ దాడికి పాల్పడినందుకు వారికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయుల ఆగ్రహ జ్వాలలు ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాకు అంటుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ ఓ పాకిస్తానీ అని, అక్కడి మిలిటెంట్ కూతురని’ ప్రచారం జరిగింది. దీంతో వెంటనే ఆమెను సినిమా నుంచి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది తీవ్రం కావడంతో ఇమాన్వీ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఓ సుధీర్ఘ లేఖ ద్వారా వాస్తవాలు తెలిపింది. “నేను ఇలాంటి వయొలెన్స్ ను, ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో మరణించిన వారికి నా ప్రగాఢ సానుభూతి చెప్పుకుంటున్నాను. నా ఐడెంటిటీ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. పాకిస్తాన్ నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు కూడా పాకిస్తాన్ మిలటరీ సంబంధం లేదు. సోషల్ మీడియాని, మీడియాని అడ్డం పెట్టుకుని నాపై విషం చల్లాలని చూస్తున్నారు. కనీసం మీడియాలో ఉన్న జర్నలిస్టులు కూడా సరిగ్గా ఆరా తీయకుండా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య ప్రచారాన్ని ప్రచురించడం బాధాకరం. ఇక నా గురించి చెప్పాలంటే… నేను ఒక ఇండో అమెరికన్ ని. హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ వంటి భాషలు మాట్లాడగలను. నేను అమెరికాలో ఉన్న లాస్ ఏంజిల్స్ లో జన్మించాను. యంగ్ ఏజ్లోనే మా పేరెంట్స్ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. నా విద్యాభ్యాసం అంతా అమెరికాలో జరిగింది.కొరియోగ్రాఫర్ గా నా కెరీర్ ప్రారంభించాను. తర్వాత నాకు ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నాపై ఇండియన్ సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది. నాలో ఉన్న ఇండియన్ సంస్కృతిని మతం, ప్రాంతం పేర్లు చెప్పి దూరం చేయకండి. ఐక్యతకు మారు రూపం కావాలని నేను భావిస్తున్నాను. మనం ప్రేమను మాత్రమే పంచాల్సిన సమయం ఇది. చరిత్రలో ఏ విషయం పై అవగాహన కల్పించాలన్నా కళనే ఉపయోగించారు. నాలో ఉన్న కళను ప్రపంచానికి పరిచయం చేయాలని కష్టపడి పనిచేస్తున్నాను. దయచేసి అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని ఇమాన్వీ తన పోస్టులో తెలిపింది. మరి ఈ విషయానికి ఇక్కడితో ఎండ్ కార్డు పడుతుందా లేదా చూడాలి.