పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓ మతానికి చెందిన వారిపై వస్తున్న ఆరోపణలపై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ దాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని శివసేన పార్టీ తరఫున హామీ ఇచ్చారు. పర్యాటకులను కాపాడడానికి వెళ్లి మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కూడా అమరుడేనన్నారు. ఉగ్రవాదుల నుండి గన్ లాక్కుని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించి సయ్యద్ హుస్సేన్ షా మరణించాడని, వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లినపుడు వారి ఆర్థిక పరిస్థితి, ఇల్లు చూసి బాధ కలిగిందని చెప్పారు.