హైదరాబాద్ నగరవాసులకు మెట్రో యాజమాన్యం షాక్ ఇవ్వనుంది. మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు మే రెండో వారంలో పెంచిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ భారత్కు వచ్చిన తర్వాత ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రోకు వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు ఆదాయం పొందాలన్న లక్ష్యంతో సంస్థ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపు అంశంపై ఇప్పటికే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం అందజేసింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ఛార్జీ రూ.10 కాగా, గరిష్ఠ ఛార్జీ రూ.60గా ఉంది. ఈ గరిష్ఠ ధరను రూ.75 వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.