పహల్గాం ఉగ్ర దాడిపై రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పాక్ సైన్యంపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మతం అడిగి మరీ దారుణంగా కాల్చి చంపారు. ఉగ్రవాదులు చంపిన వారిలో పెళ్లి అయి వారం కూడా కాని నవ వరుడు నేవీ ఆఫీసర్ వినయ్ కూడా ఉన్నాడు. అతడి మృతదేహం వద్ద అతడి భార్య హిమాన్షీ దీనంగా కూర్చొని ఉన్న ఫోటోలు దేశం మొత్తాన్ని కదిలించింది. ఈ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని ఈ స్ట్రైక్స్ కు పేరు పెట్టింది.ఈ ఆపరేషన్లో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంప్లను ఇప్పటికే నేలమట్టం చేసేశాయి. సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడుల్లో మసూద్ అజహర్ , హఫీజ్ సయీద్ మరణించినట్లు అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.