తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు పలికింది. ధరణి స్థానంలో నేటి నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. భూ సమస్యల పరిష్కారాలు సులువుగా జరిగేందుకు భూ భారతి పోర్టల్ లో ఈజీ ప్రాసెస్ ఉన్నదని ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు సామాన్య రైతులకు అర్థమయ్యే రీతిలో ఈ పోర్టల్ లో కాలమ్స్ ను రూపొందించారు. సందేహాలకు, సమస్యలకు ప్రత్యేక చార్ట్ బోర్డ్ ను క్రియేట్ చేశారు. ధరణి ద్వారా జరిగిన నష్టాలు పునరావృతం కాకుండా వ్యవస్థను చక్కదిద్దేందుకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే 35 మాడ్యూల్స్ ను కేవలం ఆరుకు కుదించారు. భూ భారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాప్ట్వేర్ మార్చేందుకు దాదాపు నాలుగు నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తిస్థాయిలో నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. మొదట మూడు మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.