రివ్యూ:
తెలుగులో వచ్చే ఒకప్పుడు వెబ్ సిరీస్లు పెద్దగా ఆకట్టుకునేవి కాదు. అయితే ఈమధ్య మాత్రం కాస్త మంచి కంటెంట్తో సిరీస్లు తీస్తున్నారు మన మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘యాంగర్ టేల్స్’. నటుడు సుహాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్లో యువ దర్శకులు వెంకటేశ్ మహా, తరుణ్ భాస్కర్, హీరోయిన్స్ మడోన్నా సెబాస్టియన్, బింధు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో ఈ సిరీస్పై ఆడియెన్స్లో మంచి ఆసక్తి నెలకొంది. మరి, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజై ఈ సిరీస్ ఎలా ఉందో, దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
ఇవీ స్టోరీలు: నాలుగు కథల సమాహారమే ‘యాంగర్ టేల్స్’. తన ఫేవరెట్ హీరో మూవీ ‘బ్లాస్టర్’ను బెనిఫిట్ షో చూసేందుకు రంగ (వెంకటేశ్) రంగంలోకి దిగుతాడు. టికెట్లు అమ్మడంతో పాటు అన్ని పనులూ తానే చూసుకుంటాడు. చెప్పిన టైమ్కు సినిమాను ప్రదర్శించలేకపోవడంతో థియేటర్కు వెళ్లిన ఆడియెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వారిలో ఒకరైన పచ్చ బొట్టు శ్రీను (సుహాస్) సినిమా పోయిందంటూ హేళన చేయడంతో రంగ అతడితో గొడవకు దిగుతాడు. ‘సినిమా హిట్ అయితే అది చేయాలి, లేకపోతే ఇది చేయాలి’ అంటూ ఆ ఇద్దరూ పందెం వేసుకుంటారు? ఆ బెట్ ఏంటి? అందులో ఎవరు నెగ్గారు? అనేది తెలియాలంటే ఫస్ట్ ఎపిసోడ్ ‘బెనిఫిట్ షో’ చూడాల్సిందే.
రాజీవ్ (తరుణ్ భాస్కర్) కుటుంబం నివసించే అపార్ట్మెంట్లో మాంసాహారం తినకూడదు. హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న రాజీవ్ భార్య పూజ (మడోన్నా) డాక్టర్ను సంప్రదించగా.. ఆమె గుడ్డు తినాల్సిందేనని సూచిస్తుంది. దీంతో పూజ తన భర్త, అత్తయ్యకు తెలియకుండా ఎగ్స్ తెచ్చుకుని తింటూ ఉంటుంది. ఆఖరుకు ఆ విషయం తెలుసుకున్న రాజీవ్.. పూజను ఏమన్నాడు? దీనికి పూజ ఏం చేసింది అనేది ‘యాంగర్ టేల్స్’ సెకండ్ ‘ఫుడ్ ఫెస్టివల్’ కథ.
బిందు మాధవి పాత్ర మూడో ఎపిసోడ్లో ఎంట్రీ ఇస్తుంది. రాధ (బిందు మాధవి) ఒక పాత ఇంట్లో అద్దెకు ఉంటుంది. బంధువులు వచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్ వారితో కలసి మెట్ల మీదే ముచ్చట్లు పెడుతుంది. మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉన్న రాధకు వారి మాటలు వినిపిస్తాయి. దీంతో ఒక రోజు తన ఇబ్బంది గురించి ఆమె వారితో చెబుతుంది. ఎంత చెప్పినా వారి తీరు మాత్రం మారదు. రాధ వారి మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనేదే మూడో ఎపిసోడ్ సారాంశం.
గిరిధర్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఎంప్లాయి. బట్టతల కారణంగా అతడి మ్యారేజ్ ఆలస్యమవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటానని పెద్దమ్మ (సుధ)తో చెబితే దానికి ఆమె ఒప్పుకోదు. ఆఖరుకు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అయితే దానికి కొన్ని నిమిషాల ముందే గిరిధర్ జాబ్ పోతుంది. పెద్దమ్మ చనిపోయాక ఆమె ఇన్సూరెన్స్ డబ్బులతో హెయిర్ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న గిరిధర్.. మళ్లీ దాన్ని ఎందుకు వద్దనుకున్నాడు అనేది నాలుగో ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది.
ఎలా ఉందంటే: ‘యాంగర్ టేల్స్’లోని కథలు వేర్వేరైనా ప్రధాన పాత్రల్లో కనిపించే భావోద్వేగం మాత్రం ఒక్కటే. కారణాలు ఏవైనా అన్ని క్యారెక్టర్లు ఆఖరుకు కోపాన్నే ప్రదర్శిస్తాయి. నాలుగు విభిన్న స్టోరీలతో అన్ని వర్గాల ఆడియెన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ తిలక్. బెనిఫిట్ షో పేరుతో నష్టపోయిన అభిమాని ఆ హీరో ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సిరీస్లో అక్కడక్కడా అసభ్య పదజాలం వాడారు. ఆయా సీన్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ‘ఫుడ్ ఫెస్టివల్’లో స్వేచ్ఛలేని స్త్రీల మనోభావాలను చక్కగా ఆవిష్కరించారు. అయితే సొసైటీలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి ఆ క్యారెక్టర్లను మరింత బలంగా చూపించి ఉండాల్సింది. భావోద్వేగాలకు పెద్దపీట వేసే ఈ స్టోరీలో మేజర్ మిస్టేక్. రంగ పాత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేశ్ మహా అద్భుతంగా నటించాడు. బిందు మాధవి రాధగా హావభావాలను బాగా పలికించారు. సుహాస్ తన పాత్రకు న్యాయం చేశాడు. తరుణ్ భాస్కర్, మడోన్నా, సుధ ఫర్వాలేదనిపించారు. బిందు మాధవీ కోసమైనా ఈ సిరీస్ను చూడొచ్చు.