జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్ తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో వైయస్ జగన్ నేడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులను హెచ్చరించారు. ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అందరికీ సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను రాసుకోండి అని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం, దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టమన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు.ప్రజల్లో వ్యతిరేకత కనిపించిన వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఒకరోజు తిరుపతి లడ్డూ అని, ఇంకోరోజు సినీ నటి కేసు అంటూ దాటవేస్తున్నారని చెప్పారు.వైసీపీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే వచ్చేది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమేనన్నారు. గతంలో ఉన్న ఏ పథకాలు ప్రస్తుతం లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఎక్కడ చూసినా మద్యం అందుబాటులో ఉందన్నారు. ఊరూరా బెల్టుషాప్లు ఉన్నాయని, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని విమర్శించారు.