కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాలన సాగిస్తోందని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. కాగ్ నివేదిక చూస్తే అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, సంక్షేమం ఊసే లేదని విమర్శించారు. ఏడాది కాలంగా మోసాలతో గడిపారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయన్నారు. వైసీపీ హయాంలో కోవిడ్ సమయంలోనూ గొప్పగా పాలించినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.08 శాతమేనని… మరోవైపు, దేశ స్థాయిలో గ్రాస్ టాక్స్ రెవెన్యూ వృద్ధి రేటు 13.76 శాతం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల జేబుల్లోకి వెళ్తోంది అని జగన్ అన్నారు. ఈ ఏడాది మాత్రమే రూ.81,597 కోట్ల అప్పులు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,32,671 కోట్ల అప్పులు తీసుకుంది. ఇందులో సగం అప్పులు ఒక్క ఏడాదిలోనే చేసి పెట్టారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడమంటే ఇదే కావచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో రూ.11 వేల కోట్ల స్కాం జరిగిందని అన్నారు. తాము 2021లో సెకి సంస్థతో 2.49 రూపాయల ధరకు ఒప్పందం చేసాం కానీ ఇప్పుడు అదే ఒప్పందాన్ని 2.11 రూపాయల ధరకు కుదిర్చారన్నారు. 25 ఏళ్ల కాలంలో ప్రజాధనంగా రూ.11 వేల కోట్లు ఆ సంస్థకు మళ్లిస్తున్నారన్నారు. ఒప్పందంపై తప్పు ఎక్కడుందో చూపిస్తే తమకే చెప్పాలన్నారు. రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సంస్థకు చైర్మన్ అయ్యారు కానీ మీడియా వాళ్లు అసత్య ఆరోపణలు చేస్తూ మాపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు నిరూపణలతో చెబుతున్నాం. కానీ ఎల్లో మీడియా అబద్ధాలతో మోసం చేస్తోంది. లోకేష్ స్నేహితుడికి 99 పైసలకు భూములు కట్టబెట్టారు. ఈ వ్యవహారాలు చూస్తుంటే ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోందని జగన్ తెలిపారు.రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయన్నారు. గతంలో పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి.. మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ ఎలాంటి కొత్త పథకాలు అమలు కాలేదన్నారు. కూటమి పాలనను దోపిడీ పాలనగా అభివర్ణించారు.