వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై చితకబాదిన యువకుడు జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జాన్ తల్లిదండ్రులు పోలీసులు తమ కొడుకును చిత్రహింసలకు గురి చేశారని చెబుతూ బాధపడ్డారు. వైసీపీ తమకు అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారు. తెనాలిలో పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారని, ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ ఉన్నారని చెప్పారు. అరెస్ట్ చేసినా కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. ఘటన అనంతరం ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారన్నారు. కేసుల వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయని, చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం మంచిది కాదని, ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు అని వ్యాఖ్యానించారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ, ప్రతీ ఒక్కరూ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపునిచ్చారు.