- రంజుగా మారుతున్న రాజకీయం
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం నడుస్తుండగా.. కొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ మళ్లి బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఈ స్కెచ్ వెనుక ఎవరు ఉన్నారు అన్నది తెలిసిందే. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒకప్పుడు గురుశిష్యులు. ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఆ మైత్రిని కొనసాగిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు టీడీపీకి సపోర్ట్ చేయడం బహిరంగంగానే చూస్తున్నాం. ఇరు పార్టీల సోషల్ మీడియా వేదికలు కూడా ఒకేతాటిపై ఉంటున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. తాజాగా సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇక్కడే బాంబ్ పేల్చారు. త్వరలో తాను టీడీపీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పక్కనే ఉన్న మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి నోరు మెదపలేదు. దీంతో వారు కూడా సైకిల్ బాట పడుతారని కేడర్ భావిస్తోంది. అయితే దీని వెనుక రాజకీయ కోణంతో పాటు ఆస్తుల కోణం కూడా ఉంది. ఈ ముగ్గురికి భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే మొత్తం వ్యాపారాలు కేంద్రీకృతం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డి అక్రమాలపై దృష్టిపెట్టింది. మల్లారెడ్డి కాలేజీని కూడా కూల్చింది. దీంతో చంద్రబాబు సాయంతో రేవంత్ తో సంధి చేసుకోవాలని ఈ నేతలు భావిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. తమకు ఓట్లు వేసిన మనుషులు ముఖ్యం కాదు.. సంపాదించుకున్న ఆస్తులే ముఖ్యమన్నమాట!