రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వైసీపీ నేతలను, కార్యకర్తలు ఇబ్బందులు పెడుతూ రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో వైసీపీ కేడర్ను నాశనం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేడు అవినాష్ రెడ్డి కడపలో పర్యటించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సోదరుడు అహ్మద్ భాషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన అంజాద్ భాషాను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచించకుండా వైసీపీ నేతలను ఇబ్బందులు పెట్టడంపైనే శ్రద్ధ చూపిస్తుందన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ టీడీపీ నేతలు సంబురపడుతున్నారని, అన్నీ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు.