ప్రతి 12 ఏళ్లకు జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2015లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ.271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.