ఆంధ్రప్రదేశ్లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలనే సంకల్పంతో అహర్నిషలు కృషి చేస్తున్నారాయన. అలాగే రకరకాల స్కీములను ప్రకటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకొచ్చిన పథకమే ‘వైఎస్సార్ వాహనమిత్ర’. సొంత వాహనాలతో స్వయం ఉపాధి పొందుతున్న క్యాబ్, ఆటో డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమును ఆయన ప్రవేశపెట్టారు. ఈ పథకం ఐదో విడత ఆర్థిక సాయాన్ని జగన్ శుక్రవారం విడుదల చేశారు. విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన వేదిక మీద బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారుల అకౌంట్స్ లో నగదు జమ చేశారు. అనంతరం సభలో ఆయన ప్రసంగించారు.
ఆటో డ్రైవర్లు తనకు అందించిన ఖాకీ చొక్కా వేసుకొని ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగం మొదలుపెట్టారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు బతుకు బండి లాగడం కోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. వెహికిల్ ఇన్సూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర అని ఆయన తెలిపారు. ఇవాళ 276 కోట్ల రూపాయల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని జగన్ చెప్పారు. ఈ స్కీమ్ తో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ధి జరుగుతోందన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని జగన్ పేర్కొన్నారు. ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ప్రజలందరి ప్రభుత్వం అన్నారు.
‘మీ వెహికిల్స్కు ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోండి. ఎంతో మంది ప్యాసింజర్లకు మీరు సేవలు అందిస్తున్నారు. ‘జగనన్న సురక్ష’ ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు మీ ఇంటికే అందిస్తున్నాం. స్కీమ్స్ అన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అవినీతికి ఏమాత్రం తావులేకుండా పథకాలను అందిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు పాలనను చేరువ చేశాం. పాదయాత్ర సమయంలో మీ కష్టాలన్నీ చూశా. అందుకే మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని మేం అమలు చేశాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన గవర్నమెంట్’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.