భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్లో పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయనను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్కు పిలిపించారు. శనివారం ఆయన పార్థివదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు. మురళీ నాయక్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సీఎం చంద్రబాబు మురళీ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.