ఆపరేషన్ సింధూర్, హైదరాబాద్లో మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యంలో పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మరోసారి సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి కీలక సమయాల్లో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైన ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా నేడు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీ, అందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు.