తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో నాయకుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీ రజతోత్సవ సభ జరిగిన తీరుపై కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ సంచలన లేఖ రాశారు. సభ జరిగిన తీరు, ప్రస్తుత రాజకీయ వ్యవహారాలు, పలు ముఖ్యమైన అంశాలపై కవిత విమర్శలు చేస్తూ, పలు అంశాలపై ప్రశంసలు సైతం కురిపించారు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ప్రధానంగా కేసీఆర్ బీజేపీ గురించి సభలో తక్కువ సేపు మాట్లాడారని కవిత ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. ఇది భవిష్యత్తులో పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలకు తెరతీసిందని కవిత వెల్లడించింది. సభ విజయవంతమవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయని కవిత పేర్కొంది. తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం చాలామందికి నచ్చిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని అంతా ఎదురుచూసినట్లు తెలిపారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా వేదిక మీదకు వచ్చేలోపు 2001 నుంచి కేసీఆర్తో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలామంది అన్నారని చెప్పారు. కార్యకర్తలను ‘ధూం ధాం’.. ఆకట్టుకోవడంలో ఫెయిలైందన్నారు. భాజపా గురించి మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో.. చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారని తెలిపారు. భాజపాను ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అంటూ చెప్పారు. కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయిందని, దానికి భాజపా ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కనీసం ఇప్పుడైనా.. మనం ఒకటి రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి.. శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి, మార్గనిర్దేశం చేయాలన్నారు. జడ్పీటీసీ సభ్యులుగా, జడ్పీ ఛైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు చాలామంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారు, పరిమితంగా కొద్దిమందికే కలిసే అవకాశం వస్తోందని భావిస్తున్నారు, దయచేసి అందర్నీ కలవండి అని కోరారు. చివరగా సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ చెప్పి ధన్యవాదాలు తెలిపారు.