ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు రావాలని కోరారు. ఇక ఈ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మాదాపూర్లోని గ్రీన్కో, ఏస్ జెన్నెక్ట్స్, ఏస్ అర్బన్ రేస్ కార్యాలయాలతో పాటు మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫార్ములా-ఈ కారు రేసు ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు రూ.41కోట్లు ఇవ్వడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.