వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తనపై జరుగుతున్న నకిలీ ఐవీఆర్ఎస్ కాల్స్, తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని ఆరోపిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను నకిలీ మద్యం కేసుతో అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని, తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఫేక్ కాల్స్ను ఎదుర్కొనేందుకు నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని జోగి రమేష్ ప్రకటించారు. ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఉన్నాయని, దమ్ముంటే బహిరంగంగా ఎదుర్కోవాలని టీడీపీ నేతలకు సవాలు విసిరారు. ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, చట్టం, టెలికం వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

