తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యలపై పోరాడతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుండి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదన్నారు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. ఆటో కార్మికులు కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.