ఇండియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకునే దిశగా మరో ముందడుగు పడింది. 2020 నుంచి నిలిచిపోయిన ‘కైలాస్ మానస సరోవర్ యాత్ర’ను పునరుద్ధరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు పర్యటనలను కొవిడ్ నేపథ్యంలో 2020లో నిలిపివేశారు. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది మోదీ, షీ జిన్పింగ్లు రష్యాలోని కజాన్లో జరిగిన భేటీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమమైంది.