ఛత్తీస్ఘడ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు అమిత్ షా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం అని పేర్కొన్నారు. నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారని వెల్లడించారు.. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి అన్నారు. భద్రతా దళాలను అభినందించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారని, 84 మంది లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉందని వెల్లడించారు. ఎక్స్ లో ఈ పోస్టును ప్రధాని మోదీ రీపోస్ట్ చేశారు.