రైతు రాజ్యం ఎవరు తెచ్చారు అనే దాని మీద కేసీఆర్, కేటీఆర్, మోదీ, కిషన్ రెడ్డి తనతో చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం.. నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని ప్రిపేర్ అయ్యి చర్చకు రా, లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే పరువు పోతుందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చర్చకు వస్తామని, సీఎం రేవంత్ రెడ్డి మాతో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నల్లమల పులి అంటాడు.. మళ్లీ నల్లమల తెలంగాణలోనే ఉందా అని అంటాడు.. అంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్లో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్న ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. ఆయన నిజాలు మాట్లాడారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి కోవర్టు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, కోవర్టు పాలన అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు అంటూ జోస్యం చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలు వేస్తానన్నాడు.. ఎవరికైనా పడ్డాయా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు.. ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం అని అన్నారు. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు.కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జడ్పీటీసీలను గెలిపించుకోవాలన్నారు.