టీటీడీ గోశాలలో గోవుల పరిస్థితిపై టీడీపీ చేసిన సవాల్ను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డీ స్వీకరించారు. ఈ మేరకు నేడు ఉదయం టీటీడీ గోశాలకు బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కౌంట్డౌన్ ప్రారంభం.. వైయస్ జగన్కి, భూమన కరుణాకర్రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్లారా చూడండి.. అంటూ టీడీపీ సవాల్ విసిరింది. కాగా, దీనిపై భూమన స్పందిస్తూ.. గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుందని విమర్శించారు.గోశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయమన్నారు. గోవుల మృతిపై కూటమి నేతలో తలో మాట మాట్లాడుతున్నారని, ఒక్కడినే రావడానికి సిద్ధమని పేర్కొన్నారు. టీడీపీ చాలెంజ్ చేసింది కాబట్టి ఆ పార్టీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అక్కడికి అనుమతించాలని డిమాండ్ చేశారు.