తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. ‘రాష్ట్రంలో ఏ గ్రామానికి అయినా సరే రేవంత్ రెడ్డి.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. 100 శాతం రుణమాఫీ అయ్యిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం. 25 శాతం రుణమాఫీ కూడా కాలేదు.’ అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేవలం మహిళలకు ఫ్రీ బస్సుతో సరిపెట్టారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.