ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరనుంది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047లోని లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీతో పాటు తెలంగాణ ఏఐ హబ్ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ దార్శనికతను, రాష్ట్ర అభివృద్ధికి రూపొందించిన క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలను దావోస్ సదస్సులో వివరించనున్నారు. అలాగే పెట్టుబడులకు తెలంగాణ ఎంత అనుకూలమో, పరిశ్రమలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పారిశ్రామిక విధానాలను పెట్టుబడిదారుల ముందు ఉంచనున్నారు.
2047 నాటికి రాష్ట్రం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలు, జీఎస్డీపీ వృద్ధికి తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం బృందం ప్రెజెంటేషన్ల రూపంలో వెల్లడించనుంది. దావోస్లో ఏర్పాటు చేసే తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ఫోర్స్, హనీవెల్, ఎల్–ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అదే విధంగా పలు రౌండ్టేబుల్ సమావేశాల్లో పాల్గొని పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

