బంగారం, వెండి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్న తరుణంలో, ఇండియన్ కరెన్సీ రూపాయి కూడా షాక్ ఇచ్చింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మార్కెట్లలో వ్యక్తమవుతోంది. కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే స్థాయికి చేరిందని నిపుణులు చెబుతున్నారు. నేడు ట్రేడింగ్ సమయంలో భారత రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ముఖ్యంగా గ్రీన్ల్యాండ్ వివాదానికి సంబంధించిన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఈ పరిస్థితుల మధ్య రూపాయి డాలర్తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో రూపాయి డాలర్కు 91.7450 స్థాయికి పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. మధ్యాహ్నం 2.12 గంటల సమయంలో రూపాయి 91.6837 వద్ద ట్రేడవుతూ కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో మాత్రం రూపాయి డాలర్కు 91.0800 వద్ద ఓపెన్ అయింది. అంతకుముందు రోజు మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ విలువ రూ.90.9775గా ఉంది. ఒక్కరోజులోనే రూపాయి దాదాపు ఒక రూపాయి మేర బలహీనపడటం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.

