పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారతదేశానికి ఆందోళనకరంగా మారిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, దేశ ప్రజలకు ఆయన భారీ భరోసా ఇచ్చారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ముడిచమురు, గ్యాస్ నిల్వలు మన వద్ద పుష్కలంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
యుద్ధం – ఇంధన సెగ
పశ్చిమాసియాలో యుద్ధం మొదలై మూడు వారాలు దాటిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రవాణా చేసే వాణిజ్య మార్గాలపై యుద్ధ ప్రభావం పడిందని ఆయన వివరించారు. భారత్కు అవసరమైన ముడిచమురులో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నందున, ప్రస్తుత పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ ప్రభావం సామాన్యుడిపై పడకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని ఆయన సభకు వివరించారు.
ఏడు ప్రత్యేక బృందాల ఏర్పాటు
కరోనా కష్టకాలంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ‘ఎంపవర్డ్ గ్రూప్స్’ ఏర్పాటు చేసినట్లుగానే, ప్రస్తుత ఇంధన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిందని ప్రధాని వెల్లడించారు. ఈ గ్రూపులు పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్ సరఫరాను పర్యవేక్షించడంతో పాటు, మార్కెట్లో నిత్యావసర ధరలు పెరగకుండా తక్షణ నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ బృందాలు పనిచేస్తున్నాయని ప్రధాని తెలిపారు.

