తెలంగాణ శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చా వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవాలు తక్కువ, అంకెల గారడీ ఎక్కువ ఉందని ఆయన ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యంగా రైతులకు, నిరుద్యోగులకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన లేదని గణాంకాలతో సహా వివరించారు.
రైతు భరోసాపై ‘కౌంటర్’ దాడి
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరిగి ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక్క సీజన్ కూడా ఆపకుండా రైతుబంధు ఇచ్చామని, కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే మూడు సీజన్ల పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టిందని ఆరోపించారు. కుడి చేత్తో రైతు బంధు నిధులను ఆపేసి, ఎడమ చేత్తో రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను వంచించడమేనని ధ్వజమెత్తారు. కెసిఆర్ ది ‘పెట్టుబడి సాయం’ అయితే, రేవంత్ రెడ్డి ది కేవలం ‘ఎన్నికల పెట్టుబడి సాయం’ అని ఎద్దేవా చేశారు.

