భారతీయ జనతా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పార్టీ వ్యవహారాల్లో నితిన్ నబిన్ తనకు బాస్ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలోనూ పార్టీ అధ్యక్షుల మార్పు సమయంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశానని గుర్తు చేశారు. పార్టీ వ్యవహారాల్లో అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారని, తాను కూడా ఒక సాధారణ కార్యకర్తగానే ఉంటానని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, తాను కూడా పార్టీ కార్యకర్తగా తన పని గురించి కొత్త అధ్యక్షుడికి వివరించానని చెప్పారు. ఇకపై తన పనితీరుపై గోప్య నివేదిక రాయాల్సింది పార్టీ అధ్యక్షుడేనని సరదాగా వ్యాఖ్యానించారు. పార్టీ విషయాల్లో నితిన్ నబిన్ మార్గదర్శకత్వాన్ని ఎదురు చూస్తున్నానని ప్రధాని అన్నారు.

