దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పెద్ద అలర్ట్ వెలువడింది. ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే ఇండిగో విమానం లండన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇండిగో విమానాన్ని ముంబైకు మళ్లించారు. లండన్ నుండి వచ్చే బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ముందుగానే అత్యవసర ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానం నుండి ప్రయాణికులను త్వరగా దింపేశారు. విమానాన్ని ఐసోలేషన్ సెంటర్కు తరలించి బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు సీఐఎస్ఎఫ్ బలగాలు. ఢిల్లీలో బాంబు పేలుడు తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టులో తనిఖీలు పెంచారు. తరచు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మరిన్ని తనిఖీలు చేపడుతున్నారు. నవంబర్ 12న శంషాబాద్ సహా ఆరు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్టును పేల్చేస్తామని మెయిల్ వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ ముంబై చెన్నై గోవా తిరువనంతపురం ఎయిర్పోర్టుల్లో బాంబులు ఉన్నాయంటూ ఇండిగో ఎయిర్ ఇండియా కార్యాలయాలకు మెయిల్స్ వచ్చాయి. భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేశారు. బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊరట చెందారు.

