ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. రాష్ట్రానికి గరిష్ట పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు రోజులు సాగే ఈ సదస్సు కోసం విశాఖ సముద్ర తీరం అందంగా ముస్తాబైంది. నగర ప్రధాన మార్గాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కూడళ్లను మరింత ఆకట్టుకునేలా మార్చారు. ఈ సదస్సుకు సుమారు 40 దేశాల నుండి 3 వేల మంది ప్రతినిధులు పాల్గొనే అంచనా వేశారు. సదస్సు భాగంగా మూడు రోజులు చర్చలు సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ద్వారా సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు 2025లో 19 ప్లీనరీలు నిర్వహించనున్నారు. ఇందులో అనేకమంది జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార నాయకులు పాల్గొంటారు. ఏకకాలంలో వివిధ సమావేశ హాళ్లలో మూడు ప్లీనరీలు సమాంతరంగా జరగనున్నాయి. సీఐఐ సదస్సు ప్రారంభం తర్వాత టెక్నాలజీ ట్రస్ట్ ట్రేడ్ కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత సింగపూర్ నుండి విజయవాడకు నేరుగా విమాన సేవలు ప్రారంభించేలా ఆ దేశ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ నిర్వహించే రీ ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ఛైర్మన్తో సమావేశంలో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం విశాఖపట్నంలో లూలూ గ్రూప్ నిర్మించే మాల్కు శంకుస్థాపన చేస్తారు. శనివారం ఉదయం బ్లూమ్బర్గ్ మీడియా సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆ తర్వాత రేమండ్ శ్రీసిటీ ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జపాన్ కెనడా న్యూజిలాండ్ బహ్రెయిన్ ప్రతినిధులతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత గూగుల్ ప్రకటించిన డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల కార్యక్రమం జరుగుతుంది.

