ఆంధ్రప్రదేశ్లో మరోసారి తీవ్ర రోడ్డు దుర్ఘటన సంభవించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద నేషనల్ హైవేపై పెళ్లి కారు అదుపుతప్పి భీకర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రయాణికులపై కారు దూసుకెళ్లింది. అన్నవరం నుంచి పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు వెళ్తుండగా ముందు టైరు పగిలి నియంత్రణ కోల్పోయింది. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. గాయపడినవారిలో విద్యార్థులు ఉన్నారు. వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. గాయాలపాలైనవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

