ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ దిగ్గజం గూగుల్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గూగుల్ విశాఖపట్నంలో అడుగుపెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసినట్లే, విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్టైమ్ డేటా సేకరణ వంటి సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని ఆయన వెల్లడించారు.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఈ దిశగా స్మార్ట్ వర్క్ నినాదంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం రాష్ట్రానికి సంతోషకరమైన విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం ద్వారా విశాఖ ఐటీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయి.