ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ నోటీసులపై స్పందించారు. ఏసీబీ నోటీసులు అందినట్లు తెలిపారు. తాను ఈ నెల 28న విచారణకు హాజరు కాలేనంటూ చెప్పుకొచ్చారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా యూకే, అమెరికాలో పర్యటించాల్సి ఉండటంతో ఆ తర్వాత హాజరు అవుతానని ఏసీబీకి సమాధానం ఇచ్చారు. కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై ఏసీబీ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్కు అండగా ఉంటాం – హరీష్ రావు
కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు అభద్రతకు స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. కల్పిత కేసులు కోర్టులో నిలబడవు అని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవు అని స్పష్టం చేశారు. కేటీఆర్కు అండగా ఉంటామని, సత్యమే గెలుస్తుందని, సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ పోస్టును రీపోస్ట్ చేశారు.