మన దేశంలోని ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నమ్మకాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. కొన్ని విషయాల్లోనైతే నమ్మకాలు, పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. హిందూ మతంలో పంచాంగం, వాస్తు లాంటివి బాగా పాటిస్తారు. అలాగే గ్రహణాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హైందవ మతంలో గ్రహణాలను చెడుగా భావిస్తారు. గ్రహణ కిరణాలను తాకడం కూడా చెడని.. మంచిది కాదని భావిస్తారు. అందుకే ప్రజలు గ్రహణం వీడే వరకు ఇళ్ల నుంచి బయటకు రారు. గ్రహణ సమయంలో మన దేశంలోని హిందూ ఆలయాలను మూసేస్తారు. గ్రహణం వీడిన అనంతరం సంప్రోక్షణ చేసి తిరిగి పూజలు మొదలుపెడతారు అర్చకులు.
గ్రహణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తుంటారు. ఆ టైమ్ లో చాలా మంది పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. గ్రహణం వీడాక ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని, స్నానపానాదులు ముగించాక భోజనం చేస్తారు. ఇక, ఈ సంవత్సరం ఆఖరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన శుక్లపక్షంలో శనివారం నాడు ఏర్పడనుంది. సరిగ్గా అక్టోబర్ 28, 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 గంటల నుంచి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇండియాతో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ తదితర దేశాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది.
ఇతర దేశాల్లో పూర్తిగా కనిపించినా భారత్ లో మాత్రం పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్థ చంద్రగ్రహణం కానుండటంతో నూతన కాలాన్ని పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. గ్రహణం మొదలయ్యే తొమ్మిది గంటల ముందు నుంచి ఈ నూతన కాలాన్ని పాటించాలట. పిల్లలతో పాటు వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం ఈ నూతన కాలం అక్టోబర్ 28వ తేదీ రాత్రి 8.25 గంటలుగా పండితులు అంటున్నారు. చంద్రగ్రహణం నాడే శరద్ పూర్ణిమ కూడా ఉండటంతో ఈ రోజు గంగానదిలో స్నానం చేసి మహావిష్ణువును పూజించడం వల్ల భక్తులు బాధలన్నీ పోతాయనే నమ్మకం ఉంది.