Sunday, June 21, 2026

ఎన్నికలపై విజయసాయి రెడ్డి కామెంట్స్.. అంతకుమించి అంటూ..!

Must Read

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఢంకా మోగింది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, ప్రచారం.. తదితర విషయాలపై పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలు, వైసీపీ విజయంపై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2019లో ఏపీలో నాటి పాలకపక్షాన్ని తొలగించి, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీని కనీవినీ ఎరుగని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని అన్నారు.

2019 ఎన్నికల్లో మొత్తం 175 సీట్లకు గానూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి 151 సీట్లలో విజయం దక్కిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. వైసీపీకి అగ్రతాంబూలం ఇచ్చిన ఓటర్లు.. టీడీపీకి కేవలం 23 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో, రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టారని చెప్పారు. ఐదేళ్ల అడ్డగోలు పాలనకు తెలుగుదేశం మూల్యం చెల్లించుకుందన్నారు. నూతన రాజధాని అమరావతి పేరుతో, అలాగే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లాంటి పేర్లతో చేసిన కుంభకోణాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో ఆ విధంగా బుద్ధి చెప్పారని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ కంటే 6 నెలల ముందు (2018 డిసెంబర్) తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తన బలాన్ని పెంచుకొని మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉందన్నారు.

‘వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రగతితో పాటు ప్రజా సంక్షేమం మీద అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఫోకస్ పెట్టింది. వృద్ధాప్య పింఛన్లను దశలవారీగా పెంచుతూ పోయే ఫైలు మీదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 మే 30న లక్షలాది ప్రజల ముందు సంతకం చేశారు. నవరత్నాలు పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే పనిని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. పేద, దిగుమ మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం తయారు చేసిన అనేక నగదు బదిలీ పథకాలను గత నాలుగున్నరేళ్లుగా పకడ్బందీగా అమలు చేస్తోంది జగన్ సర్కారు. మతం, కులం, పార్టీ అనే బేధాల్లేకుండా ఆంధ్రా ప్రజలంతా రాష్ట్ర సర్కారు పనితీరు మీద పూర్తి సంతృప్తితో ఉన్నారు’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  

అరెస్టు కరెక్టే
‘ఏపీ సర్కారుపై ప్రజలు ఇంత సంతృప్తిగా ఉన్నప్పటికీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం 2019 వేసవి నుంచి పాలకపక్షంపై దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖర్లో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక పక్క కోర్టుల్లో న్యాయవిచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు అబద్ధాలు, అర్ధసత్యాలతో బాబు అరెస్టు అన్యాయమంటూ గావుకేకలు పెడుతూ రోడ్డెక్కుతున్నారు. టీడీపీ పాలనలో ఎంత అవినీతి జరిగిందో స్వయంగా చూసిన ప్రజలు మాత్రం అవినీతి ఆరోపణల మీద జరిగిన మాజీ సీఎం అరెస్టు కరెక్టేనంటూ స్పందిస్తున్నారు’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

బాబుకు బుద్ధి చెప్పడం ఖాయం
మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. ఈ సమయంలో జనాదరణ కరువైన టీడీపీ ఇప్పుడు తీవ్ర నిరాశా నిస్పృహలతో చేస్తున్నా విన్యాసాలను ఆంధ్రా ప్రజలు గమనిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. 2024 ఏప్రిల్-మేలో జరిగే జనరల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ మెజారిటీని 160 సీట్లు దాటించి ఇంకా ఎక్కడిదాకా తీసుకెళ్తారనేది ప్రస్తుతం రాజకీయ, ఎన్నికల విశ్లేషకుల చర్చనీయాంశంగా మారిందని విజయసాయి రెడ్డి వివరించారు.  

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -