బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. బంద్ మద్దతుగా అఖిలపక్ష బీసీ సంఘాలు హైదరాబాద్ లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్ పై అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీ ఐకాస చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ ఐకాస వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగానికి పైన ఉన్న బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. శనివారం తెలంగాణ బంద్ లో పార్టీలు సంఘాలకు అతీతంగా శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.