ఆంధ్రప్రదేశ్లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి సహా బీసీ కులాల సాధికార అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది జగన్ మాత్రమే అని అన్నారు. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు.
సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలు అందించిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. బీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకురావాలని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలని సూచించారు. బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారని వ్యాఖ్యానించారు. బీసీ కులాలకు ఉనికి తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని అన్నారు. బీసీ కులాలకు గుర్తింపు, సమాజంలో చైతన్యం తీసుకొచ్చి వైభవం ఇచ్చి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్పారు. వెనుకబడిన కులాలకు సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని జగన్ హయాంలో మేలు చేశారు. ప్రతిపక్షం మనకు మంచి అవకాశం అని అన్నారు. వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి జగన్ వల్ల మనకు భవిష్యత్ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలి అని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని సూచించారు. ఏ మాత్రం జాప్యం తగదు అని అన్నారు. జగన్ ఆలోచనలు, విధానాలను బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పారు. అందరూ సమిష్టిగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు అని అన్నారు. అందరికీ అర్థమవుతోంది అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ అన్నారు అని రాచగొల్ల రమేష్ యాదవ్ తెలిపారు. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారు అని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం చేసుకునేందుకు బీసీ కులాలంతా ఏకం కావాలి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వెనకబడిన కులాలకు జరిగిన మేలు ఎవరూ మరిచిపోరు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తుంది అని మండిపడ్డారు. అబద్ధపు హామీలు, మాయమాటలతో కూటమి ప్రభుత్వం బీసీలను నిలువునా ముంచింది అని రమేష్ యాదవ్ అన్నారు. బీసీలకు జగన్ చేసిన మేలు ఎవరూ మరిచిపోరు అని చెప్పారు. మనమంతా జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీలకు చేసిన మేలు ఆ తర్వాత జగన్ మాత్రమే బీసీ కులాలకు న్యాయం చేసి గుర్తించారు అని అన్నారు. బీసీలంతా ఐక్యంగా అప్పజెప్పిన బాధ్యతలు నిర్వర్తించి ఐకమత్యంగా జగన్ను మరోసారి సీఎం చేసుకుందాం అని నౌడు వెంకటరమణ అన్నారు.