తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక తెరలేవనుంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నట్లు సమాచారం. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండో విడతలో నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా తయారీ పనులు ప్రారంభించింది. సెప్టెంబర్ 4 లేదా 5న ముసాయిదా జాబితా విడుదల కాగా, అభ్యంతరాల పరిశీలన అనంతరం సెప్టెంబర్ 8 లేదా 9న తుది జాబితా ప్రకటిస్తారు. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం కాలేకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అత్యవసరమని భావిస్తున్నారు. ఇకపోతే, హైకోర్టు కూడా సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.