తెలంగాణలో రైతులు నూనె గింజలు మరియు ఆయిల్పామ్ పంటల సాగును పెంచాలని, ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు, జాతీయ నూనె గింజల పథకం కింద 2025-26 సంవత్సరానికి రూ.46.14 కోట్లతో మేలిమి వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సచివాలయం నుంచి మంత్రి ప్రారంభించారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 మంది రైతులకు విత్తన సంచులను అందజేసి, వారితో సంభాషించారు. మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు 38,434 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. నూనె గింజల పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వినియోగాన్ని పెంచాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.