ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే కుట్రతో దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇస్తాం. ఇందులో అనుమానాలు లేవు అని చెప్పారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే ల్యాండ్ అలాట్ అవుతుంది అని స్పష్టం చేశారు. నిబంధనల తర్వాత సేల్ డీడ్ ఇస్తారు. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపు జరగదు అని తెలిపారు. ఊరికే భూ కేటాయింపులు జరగవు. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు అని మంత్రి టీజీ భరత్ సూచించారు.