తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా బిగుసుకుపోతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. పొగమంచు కూడా పెరిగింది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని, వెచ్చని బట్టలు, మఫ్లర్లు, తలపాగాలు ధరించాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా మంటలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, గ్యాస్ హీటర్లు, కట్టెల మంటల వద్ద పిల్లలను దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భీంపూర్, సిర్పూర్ (టీ) మండలాల్లో అత్యల్పంగా 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

