దేశంలో సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా ఈ నెలలో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, అయితే ఈ ఏడాది 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా వెల్లడించారు. ఈ వర్షాల ప్రభావంతో ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్లలో కూడా వర్షాల ప్రభావం వల్ల సాధారణ జీవనానికి అంతరాయం కలగవచ్చని తెలిపారు. 1980 తర్వాత సెప్టెంబరులో దేశంలో వర్షపాతం పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని, అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల్లో మాత్రం వర్షాలు తక్కువగా కురిసినట్లు మోహపాత్రా వివరించారు. ఈసారి పశ్చిమ మధ్య, వాయవ్య, దక్షిణ భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మరియు పశ్చిమ తీర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా 743.1 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మి.మీ కంటే 6 శాతం ఎక్కువని తెలిపారు. జూన్లో 9 శాతం, జూలైలో 5 శాతం, ఆగస్టులో 5.2 శాతం అధిక వర్షాలు కురిశాయని చెప్పారు. మొత్తం మూడు నెలలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు.