ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఇటీవల గుంటూరులో వైసీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నం చేశారన్నారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోందని పేర్కొన్నారు. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైసీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారిందన్నారు. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైసీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారని ఆరోపించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని పోస్టులో పేర్కొన్నారు.