రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ట్వీట్లో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” అని వ్యాఖ్యానించారు. జగన్ తన ట్వీట్లో, అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలుగా రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సులభంగా లభించే ఎరువుల కోసం ఇప్పుడు రైతులు రోజులు తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. యూరియా బస్తాను రూ.267లకు బదులుగా రూ.200 అదనంగా వసూలు చేస్తూ నల్లబజారు జరుగుతున్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అలాగే ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదని జగన్ విమర్శించారు. తమ పాలనలో ధరల స్థిరీకరణ నిధి, సీఎంఆప్ వ్యవస్థ, ఉచిత పంటల బీమా, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. ఇక ఉల్లి, చీనీ వంటి పంటలు ధరలు పడిపోతే తమ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఊరట కల్పించిందని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పిన బాబు మాట తప్పారని, రెండు సంవత్సరాలకుగాను ఇవ్వాల్సిన రూ.40 వేల బదులు కేవలం రూ.5 వేలే ఇచ్చారని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. రైతు సంక్షోభాన్ని పట్టించుకోని చంద్రబాబు పాలన అనేది వైఫల్యం తప్ప మరేదీ కాదని జగన్ పేర్కొన్నారు.